
గోదావరిఖని, వెలుగు: ప్రభుత్వ స్థలాల్లో పేదలు నిర్మించుకున్న ఇండ్లకు పట్టాలు ఇవ్వాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ డిమాండ్ చేశారు. మంగళవారం పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ ఆఫీస్ ముందు సీపీఎం ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూపోరాటం చేసి రామగుండం ప్రాంతంలోని నాలుగు చోట్ల 600 మందికి ఇండ్ల స్థలాలు ఇప్పించామని తెలిపారు.
ఆ ఇండ్లకు పట్టాలు ఇవ్వడంతో కాలనీల్లో సౌలతులు కల్పించాలని కోరారు. సింగరేణి, ఎన్టీపీసీల్లో స్థానిక నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలని, కాంట్రాక్టు కార్మికులకు రూ.26 వేల కనీస వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర బడ్జెట్లో రైతాంగం, విద్య, వైద్యం, కార్మికరంగాన్ని విస్మరించిందని పేర్కొన్నారు.
కేంద్ర బడ్జెట్లో కూడా పేదలకు ఒరిగిందేమీ లేదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా సంపన్నుల కోసం పని చేస్తున్నాయని విమర్శించారు. అనంతరం డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామికి వినతిపత్రం అందజేశారు. అంతకుముందు పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. బొజ్జ భిక్షమయ్య, భూపాల్, వై.యాకయ్య, వేల్పుల కుమారస్వామి, ముత్యంరావు, ఎం.రామాచారి పాల్గొన్నారు.